ముంబయి : ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పించేందుకు గాను కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ రుసుములను 25 శాతం తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపులు కొనసాగించాలని పేర్కొంది. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా లకు భారీ దెబ్బ తగిలింది. ఈక్రమంలో విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని రుసుములను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా.. అమెరికా- ఇరాన్‌ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన రంగం పుంజుకుంది. ఇందులోభాగంగా ఇండిగో షేర్లు ఈరోజు ఏకంగా 10శాతం పెరిగి.. అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.